Wednesday, March 26, 2025

అంశం : *కోతి* (గేయం)

*మహతీ సాహితీ కవిసంగమం*

*ప్రతిరోజూ పండుగే*

తేదీ : *11-03-2025. (మంగళవారం).

అంశం : *కోతి* (గేయం)

శీర్షిక : మానవ జాతికి తరాల తాతిది. 

రచన : శ్రీమతి, పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .

కళ్యాణ్  : మహారాష్ట్ర .




 అందని కొమ్మల నూగిసలాడుచు

ఆటల ,వేటల  నలరెడు కోతిది

 చిలిపి చేతలతో చిందులు వేస్తూ 

చెడుగుడులాడే చలాకి కోతిది  !!


 కొమ్మల నెగురుచు , రెమ్మల తుంపుచు

ప్రకృతి అందము నాస్వాదించుచు

నల్లని కళ్ళతో, నటు నిటు చూచుచు 

 కిచకిచ నవ్వుల చెలగెడు కోతిది ,!!


తోకను ఊపుచు,  తోటి చెలులతో

పండ్లను కొరికి ,   పట్టి విసరుచూ

పరాచకాలతో పరుగులు పెడుతూ 

అల్లరి చేసే చిల్లర కోతిది !!


తెలివికి పెద్దది , చేతల దొడ్డది

పెంకితనానికి  పెడసరి బిడ్డది

 ఆటల పాటల ఆనందిస్తూ 

అలసట నెరుగని అల్లరి కోతిది !!


మనిషిని పోలిన మనసున్న జాతిది.

కిచ కిచ అరుపుల కిలాడి కోతది.

బుద్ధి బలానికి పెట్టని కోటది .

మానవ జాతికి మునుపటి తాతిది. !!


దేవుని రాముని కొలచిన కోతది. 

సంద్రము దాటిన సాహస కోతిది

సీతమ్మ జాడను తెలిపిన కోతిది.

లంకను గాల్చిన లడాయి కోతిది !!


వారధి కట్టిన వానర జాతిది. 

రావణు చావుకు కారణమైనది

సీతారాముల కలయిక సాక్షిది. 

నమ్మిక భక్తిని చాటిన కోతిది. !!


-------------------------

ఈ గేయం నా స్వీయ రచన.




Saturday, March 22, 2025

అంశం : అనువాద కవిత్వము..అనువాదం కబీర్ దాసు దోహ..

మహతీ సాహితీ కవిసంగమం.

*ప్రతిరోజూ కవితా పండుగే*

 

అంశం: ఐచ్ఛికం 

కవితాసంఖ్య: 1.

తేది: 22-3-25  శనివారం .

అంశం :  అనువాద కవిత్వము.

అనువాదం కబీర్ దాసు దోహ..


అనువాదము : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి

 కల్యాణ్. మహారాష్ట్ర .(43.).


కబీర్ దాసు గురించి..


15వ శతాబ్దానికి చెందిన భారతీయ ఆధ్యాత్మిక కవి, తాత్వికుడు, మరియు సంఘ సంస్కర్త. ఐన

  కబీర్ దాస్ 1440 సంవత్సరంలో వారణాసి లో జన్మించారు.

  ఆయన ముస్లిం ."నేత కార్మికుల"  కుటుంబంలో పెరిగారు.

  ఆధ్యాత్మిక గురువు , "రామానందుని" శిష్యునిగా ప్రసిద్ధి చెందిన కబీర్ దాసు , హిందూ, ముస్లిం మతాలలోని మంచి అంశాలను స్వీకరించి ఒక నూతన ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించారు.

  కబీర్ దాస్ రచనలు "బీజక్" అనే గ్రంథంలో సంకలనం చేయబడ్డాయి.

రెండు పంక్తులలో రాయబడ్డ  ఆయన," దోహాలు" మరియు "పదాలు " వంటివి   చాలా ప్రాచుర్యం పొందాయి.

  తాత్విక దృక్పథం గల "కబీర్ దాస్" మత సామరస్యాన్ని బోధిస్తూ

 దేవుడు ఒక్కడేనని, మతాలన్నీ భిన్నమైన మార్గాలని విశ్వసిస్తూ, దేవుడు మనలోనే ఉన్నాడని, ఆయన్ని వెతకడానికి గుడులు, మసీదులు తిరగవలసిన అవసరం లేదని బోధించారు.ఆయన కుల వ్యవస్థను, మతపరమైన ఆచారాలను తీవ్రంగా విమర్శించారు.

 ఆయన రచనలు భారతీయ సాహిత్యంలో ఒక ముఖ్యమైన భాగంగా పరిగణించబడతాయి.

 

కబీర్ దాస్.దోహా :

   "బురా జో దేఖన్ మైం చలా, బురా నా మిలియా కోయ్,

  జో దిల్ ఖోజా ఆపనా, ముఝసే బురా నా కోయ్."

 అనువాదం:

  "చెడు చూడటానికి నేను వెళ్లాను, చెడ్డవాడు ఎవరూ కనిపించలేదు .

  నా మనస్సును నేను వెతుక్కుంటే, నాకంటే చెడ్డవాడు ఎవరూ నాకు కనిపించ లేదు.

 భావం:

  ఈ దోహాలో కబీర్ దాస్ స్వీయ పరిశీలనా ప్రాముఖ్యతను వివరించారు. "ఇతరులలోని చెడును వెతకడం కంటే, మనలోని లోపాలను సరిదిద్దుకోవడం ముఖ్యం "

అన్న భావాన్ని ఈ పద్యంలో ఆయన వ్యక్తపరిచారు .

-----------------------------------------


Saturday, March 8, 2025

పట్టుదలతో చదివి జడ్జి అయిన గిరిజన బాలిక

*_🙏జడ్జ్ శ్రీపతి మేడంకు శుభాకాంక్షలు🙏_*
***************************
*టీనేజ్ అమ్మాయికి నల్లకోటు వేసినట్టు ఉన్న ఈ అమాయకపు అమ్మాయిని తదేకంగా మళ్ళీ మళ్ళీ చూడండి. ఈమె పేరు శ్రీపతి... చెన్నై నుండి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువన్నామలై దగ్గర జువ్వాది పర్వతశ్రేణుల మధ్య ఉన్న గిరిజన గూడెం వాళ్ళది. తండ్రి కాళిదాస్, తల్లి మల్లిక. కొండప్రాంతంలో పోడు వ్యవసాయం చేసేవాళ్ళు... శ్రీపతి కి ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు.*

   *పిల్లల చదువుకోసం ఆ కుటుంబం దగ్గరలోని 'అత్నావర్' అనే పల్లెకు వలస వచ్చింది. ఇక్కడా ప్రధానంగా పోడు వ్యవసాయమే... అయినా పిల్లలు చదువుకోడానికి మంచి స్కూల్ ఉందని సంతోషించారు. కాళిదాస్ టూరిస్ట్ ప్రదేశాల్లో హౌజ్ కీపింగ్ లాంటి పనులకు కుదురుకున్నాడు.*

*వాళ్ళది 'మలయలి' అనే అత్యంత వెనుకబడిన గిరిజన తెగ... ఆ తెగలో అమ్మాయిలను చదివించడం, బయటకు పంపడం పట్ల అనేక ఆంక్షలు ఉంటాయి. కాళిదాస్, మల్లిక దంపతులు వీటిని ఏమీ పట్టించుకోలేదు. శ్రీపతి చదువులో మెరుగుగా రాణిస్తూ.. అందరికంటే ముందు ఉండడం, ఉన్నత చదువులు చదువుతాను అని పట్టుబట్టడంతో ఆమెను తిరువణ్ణామలైలో "లా" కోర్సు చదివించారు.*

*బంధువుల ఒత్తిడి కారణంగా శ్రీపతికి వెంకట్రామన్ అనే యువకుడితో వివాహం జరిపించారు. పెళ్ళైనా శ్రీపతి చదువు మాత్రం ఆపలేదు. _"Dr. అంబేడ్కర్ లా విశ్వవిద్యాలయం"_ లో పీజీ చేసింది. వెంటనే జూనియర్ సివిల్ జడ్జ్ పరీక్షకు అప్లై చేసింది. అయితే పరీక్షకు అప్లై చేసేనాటికే తాను గర్భవతిని అని తెలిసింది. సరిగ్గా పరీక్ష తన డెలివరీ ఒకేసారి అయ్యేలాగా ఉందని ఆందోళన చెందింది. అయితే తల్లిదండ్రులు, తన ఫేవరెట్ టీచర్ మహాలక్ష్మి , భర్త వెంకట్రామన్ ధైర్యం చెప్పారు. చదువుకోవడం పట్ల దృష్టి పెట్టు అంతా మంచే జరుగుతుందని సర్ది చెప్పారు.*

*శ్రీపతి తదేక దీక్షతో పరీక్షలకోసం పట్టుదలగా చదివింది. తల్లి మల్లిక అనుక్షణం శ్రీపతి ని  కనిపెట్టుకుని ఉంది. పరీక్ష రాయాల్సిన డేట్ వచ్చేసింది. డెలివరీకి వెళ్ళేముందు కూడా పుస్తకాలు చదవడం వదలలేదు శ్రీపతి.*

   *నవంబర్  27 న శ్రీపతి చక్కటి పాపకు జన్మనిచ్చింది. నవంబర్ 29 న పరీక్ష. రెండ్రోజుల బాలింత. పరీక్ష రాయల్సిన చోటు.. 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెన్నైలో... అయినాసరే పరీక్ష రాస్తానని పట్టుబట్టింది. డాక్టర్లు వారించినా వినలేదు. తన శ్రమ వృధా కాకూడదని వేడుకుంది. తల్లిదండ్రులు భర్త సహకారంతో పసిగుడ్డుతో ప్రయాణం చేసి పరీక్ష వ్రాసింది. సెలెక్ట్ అయ్యింది. TNPSCలో ఇంటర్వ్యూ కు అటెండ్ అయ్యింది. మొన్ననే... ఫిబ్రవరి 15, 2024 నాడు జూనియర్ సివిల్ జడ్జ్ గా, _"మొట్టమొదటి గిరిజన మహిళగా"_ అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకుంది...*

      *అకుంఠిత దీక్షతో, ఎన్ని అవాంతరాలు ఎదురైనా ధైర్యంగా తట్టుకొని చదివి , విజయాన్ని అందుకున్న _"ఈ బంగారు తల్లి శ్రీపతి విజయగాథ"_ ఆమెలాంటి వందల మందికి ఆదర్శం కావాలి.*

*మరో సారి  జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీపతి మేడం కు శుభాకాంక్షలు... తెలుపుదాం🌹🌹👏👏👏*
-----------------------ఈమె జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోండి.. మరింత మందికి షేర్ చేయండి:
వెలిశెట్టి నారాయణరావు, 
విశ్రాంత సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు, 
ఆత్మకూరు పట్టణం, 
నెల్లూరు జిల్లా