20/05/2025.
తపస్వీ మనోహరం "e" book పత్రిక కొరకు ,
అంశం : పంచమ వేదం.
శీర్షిక : అమృత నాదం.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కళ్యాణ్ : మహారాష్ట్ర.
అనాదిగా ప్రవహించే సనాతన ధర్మం,
వేదాల దివ్యనాదం, ఋషుల తపో ఫలం.
శ్రుతులు, స్మృతులు, ఇతిహాసాల మౌన గంభీరత,
మానవాళికి మోక్ష మార్గం చూపిన దివ్య తేజం.!!
ధర్మం, అర్థం, కామం, మోక్షం - నాలుగు తీరాల నది,
వేద నాదం ప్రతి తీరాన అమృత బిందువై ఒదిగింది.
కాల గమనంలో మరుగున పడిన సత్యం .
పునరుద్ధరించగ వచ్చింది "పంచమ వేదం "!!
వ్యాసుని లేఖినిలో మహా భారతం పురుడు పోసుకోగా,
"భగవద్గీత సారం" విశ్వానికి వెలుగు పంచింది.
రామాయణ,భారత, భాగవతాది, పురాణాల పవిత్ర గానం,
"పంచమ వేదమై", లోకానికి నవ చైతన్యం తెచ్చింది.!!
పంచము వేదం , కేవలం శ్లోకాల సంపుటి కాదు,
ప్రతి హృదయంలో జ్వలించే జ్ఞాన దీపం.
కుల, మత, వర్గ భేదాలు లేని విశ్వ ప్రేమ స్వరూపం.
మానవత్వమే మహోన్నతమని చాటే శాంతి సందేశం.!!
భక్తి, జ్ఞానం, కర్మల - త్రివేణి సంగమం .
పురనేతిహాసాలిడు ఆత్మ సాక్షాత్కారాలకు గమ్యం.
ప్రతి జీవిలోనూ దైవత్వాన్ని దర్శించే దివ్య దృష్టి,
పంచమ వేదం నేర్పే నిత్య జీవన సత్యం.!!
అందుకే ఈ ధర్మం సనాతనం, సజీవం,
యుగయుగాలకూ మార్గదర్శనం.
అంధకారాన్ని చీల్చే జ్ఞాన భాస్కరం,
మానవాళికి నిత్య వసంతం, "పంచమ వేదం".!!
No comments:
Post a Comment