Friday, September 23, 2022

వ్యాసం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*మహతీ సాహితీ కవిసంగమం, కరీంనగరం*
*తేదీ*:  *23/09/22 – శుక్రవారం* 
*అంశం*:  *ఐచ్చికం*  
*ప్రక్రియ*: *వ్యాసం* 
*శీర్షిక*:  *ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (కృత్రిమ మేధస్సు)*
*కవి/రచయిత*: *యేచన్ చంద్ర శేఖర్*
*ఊరు*:  *హైదరాబాద్*
*ధృవీకరణ*: *అంతర్జాలం మరియు సామాజిక మాధ్యమాలలో వివిధ రూపాలలో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రచించిన నా స్వీయ రచన అని ధృవీకరిస్తున్నాను*
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (కృత్రిమ మేధస్సు)*


ఈ సృష్టిలోని సకల ప్రాణకోటిలో తెలివితేటలు కలిగి స్వతహాగా ఆలోచించడమే కాక తన ఆలోచనలను ఇతరులకు తెలియచేసి వారి ద్వారా పనులు చేయించుకోగలిగిన సామర్థ్యం కలిగిన ప్రాణి కేవలం ఒక్క మానవుడే. కొన్ని జంతువులకు తెలివితేటలు మరియు ఆలోచనా శక్తి ఉన్నప్పటికీ అది వాటి వరకు పరిమితం తప్ప తమ ఆలోచనలను ఇతర జంతువులతో పంచుకుని వాటి ద్వారా పనులు చేయించుకోలేవన్న విషయం మనందరికీ తెలుసు. అయితే మానవుడు తనకన్నా ఎంతో శక్తివంతమైన, భారీ క్రూర మృగాలను సైతం తన తెలివితేటలు మరియు ఆలోచనాశాక్తితో లొంగదీసుకుని, తన చెప్పుచేతల్లో పెట్టుకుని వాటికి శిక్షణ ఇచ్చి పని కూడా చేయించుకోగలుగుతున్నాడు. తనదైన తెలివితేటలతో శాస్త్రసాంకేతికంగా ఎంతో పురోగతి సాధిస్తూ ఎన్నెన్నో నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతున్నాడు. కొన్ని దశాబ్దాల క్రితమే మానవ మేధస్సుతో ఆవిష్కృతమైన కంప్యూటర్ ఇంతింతై వటుడింతై అన్నట్లు మానవ జీవితంలో ఒక అంతర్భాగంగా మారిపోయింది. ఇది అది అని తేడా లేకుండా నేడు కంప్యూటర్ లేని రంగాన్ని మనం ఊహించలేము. కొన్ని ప్రమాదకరమైన, క్లిష్టమైన పనులను చేయడం కోసం ఇప్పటికే రోబోట్ లకు పురుడు పోసిన మానవుడు మరొక అడుగు ముందుకు వేసి విప్లవాత్మక “ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్” (కృత్రిమ మేధస్సు) కు నాంది పలికాడు. డేటా సైన్స్ లో భాగమైన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కంప్యూటర్ లలో ముందస్తుగా నిక్షిప్తం చేయబడిన సమాచారం మేరకు నిర్దుష్టమైన ప్రామాణికతలను పాటిస్తూ పరిస్థితికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుని అప్పగించిన కార్యాన్ని పూర్తి చేయగలగడానికి మార్గం సుగమమయ్యింది.   

*ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వాడకం ఎప్పుడు మొదలైంది:*
1991 లో మొట్టమొదటి సారి అమెరికా సైన్యం “డైనమిక్ అనాలిసిస్ అండ్ రీప్లానింగ్ టూల్” (DART), అనే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రోగ్రాం ను సైనికులు, సరుకు తరలింపు మరియు ఇతర రవాణా సంబంధిత సమస్యల పరిష్కారం కోసం ఉపయోగించింది. స్వయంసంచాలిత ప్రాణాంతక వ్యవస్థలలో భాగాలైన “స్లాటర్ బోట్స్” లేదా “కిల్లర్ బోట్స్” మానవ ప్రమేయం లేకుండా శత్రువులను గుర్తించి మట్టుబెట్టగలవు. కృత్రిమ మేధస్సు సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే ఈ ఆయుధాలు ప్రతికూల వాతావరణంలో ఊహించని పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా సైనికులు ఏక కాలంలో బహుళ కార్యాలను నిర్వహించగలిగే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి.  ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, భౌగోళిక విశ్లేషణతో కలిసి సంయుక్తంగా పనిచేస్తూ వివిధ  ఆయుధాలతో అనుసంధానించబడిన రాడార్లు మరియు ఇతర ఉనికిని కనిపెట్టే వ్యవస్థల ఆధారంగా చట్టవ్యతిరేక, అనుమానాస్పద కార్యకలాపాలను పసిగట్టి సంబంధిత అధికారులను అప్రమత్తం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సైనిక దళాలు అధునూతన సాంకేతిక పరిజ్ఞానం సముపార్జనలో భాగంగా అభిజ్ఞాత్మక రాడార్, 5జి సెల్యులార్ నెట్ వర్క్, మైక్రోచిప్స్, సెమికండక్టర్స్ మరియు అనలిటిక్ ఇంజిన్స్ లాంటి వాటి కోసం పెట్టుబడులు పెడుతున్నాయి. అంతేకాక ప్రస్తుతం అందుబాటులో ఉన్న లేసర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత మెరుగుపరచడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి.  
            
*భారత సైన్యంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్:*
చైనా మరియు పాకిస్తాన్ లతో సరిహద్దులను పంచుకునే మన దేశానికి సర్వత్రా ప్రమాదం పొంచి ఉండడంతో దుర్భేద్యమైన నైసర్గిక స్వరూపం గల ప్రాంతాలను ప్రతికూల వాతావరణ పరిస్థితులలో సైతం కంటికి రెప్పలా కాపాడే బాధ్యతను భారత సైన్యం నిర్వహిస్తుందన్న విషయం మనందరికీ తెలుసు. అయితే ప్రపంచంలోనే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఆధారంగా అత్యంత సునిశితమైన సామర్థ్యంతో పనిచేసే ఎన్నో ఉపకరణాలను వినియోగించి తమ సైనికులు ప్రమాదాల బారిన పడే సందర్భాలను గణనీయంగా తగ్గించగల్గిన అతి కొద్ది దేశాలలో భారత్ ఒకటి. ఊహించని అనూహ్యమైన ప్రతికూల పరిస్థితులలో కూడా సైనికుల సామర్థ్యాన్ని పెంచడానికి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ దోహదమవుతుంది. ఇది సెన్సార్ల సామర్థ్యం మెరుగుపర్చడంతో పాటు సైనికులకు యుద్ధక్షేత్రంలో రోబోట్ల ద్వారా సేవలందిస్తుంది. చీకటిలో మరియు దట్టమైన ప్రాంతాలలో సాధారణ కంటిచూపుకు కనిపించని ప్రదేశాలలో దాక్కొని ఉన్న శత్రువులను సైతం పసిగట్టడంలో ఈ సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో ఉపకరిస్తుంది.  ప్రపంచంలో  ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పేటెంట్ హక్కులు కలిగిన పది దేశాలలో భారత్ ఎనిమిదవ స్థానంలో ఉంది. చైనా, అమెరికా, జపాన్ లు మొదటి మూడు స్థానాలను ఆక్రమించగా రష్యా మరియు ఫ్రాన్స్ దేశాలు భారత్ తరువాత స్థానంలో ఉండడం గమనార్హం. సాధారణంగా అత్యధిక భాగం రోబోట్లను పేలుడు పదార్థాల ఉనికిని పసిగట్టడం, వాటిని నిర్వీర్యం చేయడం, నిఘా, తదితర అవసరాల కోసం ఉపయోగిస్తుంటారు. అయితే ఆయుధాలను ఉపయోగించే రోబోట్లు మాత్రం టెలిస్కోపిక్ విధానం ద్వారా పనిచేసే సామర్థ్యం కలిగి ఉంటాయి తప్ప వాటంతట అవి శత్రువుల ప్రాణాలను హరించ లేవు. రోబోటిక్స్ మరియు సైనిక సాంకేతిక పరిజ్ఞానం పరుగులో ముందంజలో ఉన్న చైనా తాను హెవీ డ్యూటీ రోబోట్ ను రూపొందించినట్లు ప్రకటించింది. దేశ భద్రత దృష్ట్యా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలన్న విషయాన్ని అధ్యయనం చేయడానికి ప్రధానమంత్రి మరియు రక్షణ మంత్రి చొరవతో 2018 లో ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ సిఫార్సుల మేరకు కనీసం 75 ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఆధారిత సేవలను భారత సైన్యం వినియోగించుకుంటోంది. టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ టాస్క్ ఫోర్స్ సిఫారసు మేరకు ఫిబ్రవరి 2019 లో  “డిఫెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కౌన్సిల్” (DAIC) మరియు “డిఫెన్స్   ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రాజెక్ట్ ఏజెన్సీ (DAIPA) లు ఏర్పాటయ్యాయి. ఈ రెండు సంస్థలు భారత సైన్యంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాంకేతిక పరిజ్ఞానం అమలుకు అనుసరించాల్సిన విధానపరమైన మార్పుల గురించి అవసరమైన మార్గదర్శనం అందిస్తాయి. ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన అమెరికా సైన్యం ఆగష్టు 2018 లో టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ నగరంలో  ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాంకేతిక పరిజ్ఞానం అమలు కోసం ప్రత్యేకంగా “US ఆర్మీ ఫ్యూచర్స్ కమాండ్” (AFC) ను ఏర్పాటు చేసింది. జూలై 2018 ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రణాళిక ను ప్రకటించిన చైనా, 2030 నాటికి ఈ విభాగంలో ప్రపంచంలో అగ్రస్థానానికి చేరుకోవాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. పాకిస్తాన్ ఆగష్టు 2020 లో రావల్పిండి లోని చక్లాలా లో “సెంటర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అండ్ కంప్యూటింగ్” ప్రారంభించగా, ఆ దేశం మిత్ర దేశమైన టర్కీ “టర్కిష్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్” ను 2018 లో ప్రారంభించింది. 

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాంకేతిక పరిజ్ఞానం అమలు ద్వారా భారత సైన్యం ఎలా బలేపెతమవుతోందో రక్షణ శాఖ అధికారులు “ది సండే గార్డియన్” మ్యాగజైన్ తో పంచుకున్నప్పటికీ  భద్రతాపరమైన కారణాల దృష్ట్యా కొంత సంక్లిష్టమైన సమాచారాన్ని మాత్రం గోప్యంగా ఉంచడం జరిగింది. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే వివిధ ఉపకరణాలను రహస్య మానవ కార్యకలాపాలు, అనుమానాస్పద వాహనాల కదలికలు (పుల్వామా ఉగ్రవాద దాడి లాంటి ఘటనల నిరోధానికి), పాకిస్తాన్ తీవ్రవాదులు తమ దాడుల ప్రణాలికల గురించి ప్రాంతీయ యాసతో ఉర్దూ, పంజాబీ మరియు ఇతర స్థానిక భాషలలో జరిపే సంభాషణల సారాన్ని విశ్లేషించడానికి అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. గత నాలుగేళ్ళలో రక్షణ ప్రభుత్వరంగ సంస్థల ప్రగతిని పరిగణన లోకి తీసుకున్న భారత రక్షణ మంత్రిత్వ శాఖ మున్ముందు ఈ సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే ఉపకరణాల సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచేందుకు మరియు అవసరాలకు అనుగుణంగా సేవలందించేలా సరిపడినన్ని నిధులు కేటాయించి ప్రపంచంలో ఐదవ స్థానానికి చేరాలన్న లక్ష్యం తో ముందుకు సాగుతోంది.      

ఈ సాంకేతిక పరిజ్ఞానంతో భారత సైన్యం ఉపయోగిస్తున్న వివిధ ఉపకరణాలలో క్రింది వాటిని ప్రముఖంగా  పేర్కొనవచ్చు: 

1. స్టార్మ్ డ్రోన్
2. డ్రోన్ ఫీడ్ అనాలిసిస్ 
3. సీకర్ మానిటరింగ్ అండ్ అనాలిసిస్ సిస్టం 
4. మాండరిన్ ట్రాన్స్లేటర్స్
5. “ప్రాజెక్ట్ ప్రిస్మ్ 
6. “ప్రాజెక్ట్ వి-లాగర్” వెహికల్ ట్రాకింగ్ సిస్టం
7. సర్వత్రా పహచాన్ 
8. సైలెంట్ సెంట్రీ
9. ఏఐ బేస్డ్ ఇంటర్ సెప్ట్ మేనేజ్మెంట్ సిస్టం 
10. చౌకాస్ 
11. ఏఐ కేపబిలిటి in స్వార్మ్ డ్రోన్స్ 
12. సాపర్ స్కౌట్, మైన్ డిటెక్షన్ UGV 
13. ఏఐ బేస్డ్ శాటిలైట్ ఇమేజరీ అనాలిసిస్ 

ఏదేమైనప్పటికీ మానవ మేధస్సు ఆవిష్కరించే ఏ అధునాతన  సాంకేతిక పరిజ్ఞానమైనా లోక కల్యాణానికి, మానవ జాతి పురోగమనానికి, పర్యావరణ పరిరక్షణకు, జీవ వైవిధ్యానికి  దోహద పడేలా  ఉండాలి తప్ప తిరోగమనానికి లేదా విధ్వంసానికి హేతువు కాకూడదు. ఏమంటారు !

అంశం : దైవం.పొర్ల వేన గోపాలరావు. Good.

*మహతీ సాహితీ కవిసంగమం, కరీంనగరం*
తేదీ: *22-09-2022-గురువారం*
అంశము: *దైవం*
*********************
పేరు: *పొర్ల వేణుగోపాల రావు*
ఊరు: *ఎల్లారెడ్డిపేట, రాజన్నసిరిసిల్ల*
శీర్షిక: *సహస్ర శీర్షం దేవం...*
ప్రక్రియ: *ఇష్టపది*
*********************
*(1)*
*ఆది మధ్యాంతముల*
*నసలె యెఱుఁగని వాడు!*
*అఖిలలోకంబులకు*
*నాధార భూతుండు!*
*సృష్టి,స్థితి,లయలందు*
*దృష్టి నిలిపినవాడు*
*చతుర్దశ భువనముల*
*చలనకారకుడతడు!*
*అన్ని శక్తుల మించు*
*నాది మౌలిక శక్తి!*
*భూ,నభోంతరాళపు*
*పురుడుబోసినవాడు!*
*చతురంగ బలుడతడు*
*చదరంగమున రేడు!*
*ఇదియె దైవపు హేల!*
*ఇల వేణుగోపాల!!*

*(2)*
*మట్టిబొమ్మలజేసి*
*మాయలో ముంచునట!*
*మరల మహిమలు జూపి*
*పరలోకమిచ్చునట!*
*నవరంధ్రముల తిత్తి*
*నవరసంబుల నింపి*
*నటనాలయంబులో*
*నాటకము నడిపించు!*
*దుష్టులను పరిమార్చు*
*శిష్టులను రక్షించు!*
*వేవేల నామాలు!*
*వేవేల రూపాలు!*
*వేదవేదాంగాలు*
*వేలుపన్నది యతడె!*
*ఇదియె దైవపు లీల!*
*యిల వేణుగోపాల!!*
*********************
హామీపత్రము.. *స్వీయరచన*

Wednesday, September 21, 2022

బాల సాహిత్యం

అంశం: బాలసాహిత్యం
( త గుణింతముతో)
శీర్షిక: బ్రతుక నేర్వాలి కన్నా .
శీర్షిక  : గేయ కవిత.
రచన :శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.



తొలి వందన మిడు తొలి వేల్పులకు
తొలి వేల్పులు మన తల్లిదండ్రులు .॥
తొలి వందన మిడు గురువు పెద్దలకు
తేడా జుాపని జ్ఞాన  దాతలకు ॥

తొలి జేసిన మన పుణ్య ఫలమిదే
తల్లి గర్భమున మానవ జన్మే ॥
తలచ చక్కన్ని తనువు ధనమిది
తలచు కార్యయములు జేయు పెన్నిధి॥

తొలి కోడి కుాతకు చలి యనుచు జోగక
తోడుతు నిద్దుర  లేవాలి ॥
తల్లిదండ్రుల మాఁట మన్నించి
తీరుగ స్కుాలుకు వెళ్ళాలి ॥

తెలుగు భాష మన మాతృభాష గద
తెలుగక్షరాలు నేర్వాలి.॥
తేట తెల్లని లేత మనసుతో
తెలివితొ చదువులు చదవాలి ॥

తండ్రి పేరు నిలబెట్టాలి.
తగిన ఘన కీర్తి పొందాలి ॥
తక్కు వెక్కువల బేధము నెంచక
తీరుగ చెలిమితో మెలగాలి ॥

తాయిలాలు తినుబండారాలను
తోడుగ కలసి భుజించాలి.॥
తీయని నీతిడు కధలను జెప్పే
తాత బామ్మలను ప్రేమించాలి ॥

తోడ పుట్టిన  అక్కాచెల్లెలకు
తోడుా నీడగ నిలవాలి ॥
తెంపరి తనమును విడనాడాలి
తప్పులు చేయక యుండాలి ॥

తారతమ్యములు విడనాడాలి.
తారల వలె తళుకీనాలి ॥
తేట ప్రకృతికి పచ్చదనమునిడు
తరువు చెరువులను కాపాడాలి॥

తావీయకు నువు తగాదాలకు
తంటాలన్నవి తగవుర మనకు ॥ 
తీయని మాటలు తేనెల ఊటలు
తరతరాలకవి తరగని  నిధులు ॥

పాడి పంటలతొ కళ కళ లాడే
తల్లి భారతికి ప్రణమిల్లాలి ॥
తిరుగు లేనిదౌ మాటుండాలి
తీర్పు నేర్పులతొ జీవించాలి ॥









Tuesday, September 20, 2022

రుబాయిలు.

20/09/2022
మహతీ సాహితీ కవి సంగమం.
అంశం : రుబాయిలు.

శీర్షిక : కరుణించు క్రిష్ణయ్యా..🙏

రచన :శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.



నువువేణువు నుాదినంత వివసులమై నిలచితిమే
నీ రుాపము చుాడనంత  ఆర్తులమై పిలచితిమే
నీకోసమె మాబ్రతుకని నీవెరుగవ శ్రీకృష్ణా !
నీపాదము మొాపినంత  దాసులమై కొలచితిమే ॥

వెన్న దింగిలించినా వెక్కిరించలేదయా
రేపల్లె జనులంతా ధిక్కరించలేదయా
నీ బాల లీలలకై నిలచి వేచినారుగా
కారణజన్ముడవీవు కరుణించ రావయా ॥

నీ వేణు గానముల నాదమై పాడనా
నీ కాలి అందియల  మువ్వనై ఆడనా
నీరాక కోసమై స్వైరిణై వేచితిని
నీకరుణామృతముల బంధమై వేడనా ॥

********************************

Sunday, September 11, 2022

ఆవు

03/09/2022
మహతీ సాహితీ కవి సంగమం 
అంశం : ఆవు.
శీర్షిక : గోవు మనకు వేల్పండి-
 గోమాతకు మ్రొక్కండి.

రచన :
శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర

అందమైన పిల్లలుా అల్లరేల బాలలుా
అమ్మ మాట విన రండి ఆవుపాలు తాగండీ
అమ్మ పాలు తాగినారు అందంగా ఎదిగినారు.
అమ్మ పాల వంటి మేటి గోవు విలువ తెలుసుకోండి ॥

పాల సంద్రమున పుట్టిన పసిడి లక్ష్మి రుాపిదండి
 ముక్కోటి దేవతలకు నెలవైనది గోవుసుండి.
 మీగడంత తోడిడగా వచ్చు పెరుగు చిలకండీ 
ముద్దు కృష్ణ మెచ్చు వెన్నముద్ద లెంతొ రుచి కదండి॥
 
 పాల తోడు పెరుగది చలవచేయు సారమండి.
 పాయసాల రుచులు ఆవు పాలతోనె మెరుగండి .
తీయనైన పాల వేల పాకములిడు దినుసులండి .
 తీపి పాకముల కమ్మని నేతి ఋచులు తినరండి ॥
 
 మేలు పోషకాల ఫలము ఆరోగ్యము నిడు గుణము
ఆవు పేడ ఎరువు ధనము  మేలు వంట కింధనము
తగ్గునుాబకాయము ఎముకలకిడు కడు బలము .
రోగ ముక్తి కౌషధమ్ము  కలిమి పంచు మేటి వరము ॥

ఆవు అమ్మ వంటిది బేధమెంచబోదది .
ఎవరికైన ఆకలన్న గోవుపాలె పెన్నిధి.
పచ్చగడ్డి తినెడు పాడి యావు భువిని వేల్పది 
పంచ గవ్యములిడు మాతకు చేతులెత్తి మ్రొక్కండి ॥

--------------------------------------


హామీ : ఈ కవిత నా స్వీయ రచన.