Monday, May 26, 2025

కలం.. చిత్ర కవిత.

26/05/2025.( సోమవారం) 
మహతీ సాహితీ కవి సంగమం.
అంశం :  చిత్ర కవిత..(106).
శీర్షిక : : విప్లవ జ్వాల.
ప్రక్రియ :  వచన కవిత.
కవిత సంఖ్య : 1 
రచన :  శ్రీమతి :  పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కళ్యాణ్ :  మహారాష్ట్ర. (38.).


కలము, ఓ నిశ్శబ్ద  కళాకారిణి,
అక్షర సమూహాలతో భావాలకు ప్రాణం పోస్తుంది.
సిరా చుక్కలు, రంగులద్దిన స్వప్నాలై,
కాగితంపై కవితాక్షరాలై చిందులు వేస్తాయి !!

కలం , అక్షరాలనల్లే ఓ అద్భుత సృష్టి!
ఊహల రెక్కలకు బలం చేకూర్చి,
పద బంధాలతో కొత్త లోకాలను సృష్టిస్తుంది, 
కాలంతో పాటు నడిచే సత్య ప్రభోధిని !!

కలం , అక్షర స్వరాలను పలికిస్తూ, 
మౌన గీతాలు పాడుతుంది.
సూక్ష్మమైన ఆలోచనలకు ఆకృతినిస్తుంది.
పదునైన కొనతో, పదాలు చెక్కుతుంది.!!

కలము, చేతిలో ఒదిగిన ఒక నిప్పుకణం,
అక్షర జ్వాలలతో అన్యాయాన్ని దహిస్తుంది.
నిశ్శబ్దంగా రగిలి,  నిజాలను ప్రజ్వలించి,
లోకంలో మార్పుకు నాంది పలుకుతుంది.!!

ఇందులో ఉన్నది కేవలం సిరా చుక్కే కాదు,
అణగారిన గొంతుల నుండి పెల్లుబికిన ఆగ్రహం.
అక్షరం, అక్షరంతో  కలిసి అణ్వాస్త్రమై,
నిరంకుశత్వపు కోటలను కూల్చివేస్తుంది.!!

కలం, కధాక్షరాల పోరాట భేరి,
ప్రజల ఆవేశానికి, అస్త్ర మౌతుంది.
ప్రతి పదం ఒక పిడికిలై,
అణచివేతలపై తిరుగుబాటు చేస్తుంది, !!

కలం, కాగితంపై  కదలే జ్ఞానాక్షర ధనం.
సంకెళ్ళను తెంచుకునే సంకల్ప బలం.
రాతిలో నిండిన భక్తి , రాతలో దాగిన శక్తి , 
సమ సమాజ స్థాపనకు వేసే పునాది .!!

కలం, ప్రజల భావ బీజాల చైతన్య శక్తి.
ప్రతీ రంగుకు ప్రాణం పోసే కవితా స్ఫూర్తి.
ప్రతీ భావానికి చిత్రం గీస్తుంది.
కావ్య ,కధా, కళలకు కన్నతల్లి అవుతుంది!!

 కలం, నిరాశను ఆశగా మారుస్తుంది
 అంధకారాన్ని కాంతిగా మారుస్తుంది.
నిజాల వేటతో చరిత్ర సృష్టిస్తుంది.
అదే కలం కదిలితే, చరిత్రే మారుతుంది.!!

---------------------------
ఈ కవిత నా స్వీయ రచన.

Sunday, May 25, 2025

శీర్షిక : : విప్లవ జ్వాల. ( కలం).

26/05/2025.( సోమవారం) 

మహతీ సాహితీ కవి సంగమం.

అంశం :  చిత్ర కవిత..(1).

శీర్షిక : : విప్లవ జ్వాల.

ప్రక్రియ :  వచన కవిత.


రచన :  శ్రీమతి :  పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .

కళ్యాణ్ :  మహారాష్ట్ర. (38.).



కలము, ఓ నిశ్శబ్ద  కళాకారిణి,

అక్షరాల రంగులతో భావాలకు ప్రాణం పోస్తుంది.

సిరా చుక్కలు, రంగులద్దిన స్వప్నాలై,

కాగితంపై భావాక్షరాలై చిందులు వేస్తాయి !!


ఊహల రెక్కలకు బలం చేకూర్చి,

తన రచనలతో కొత్త లోకాలను సృష్టిస్తుంది, 

కలం , కవితలల్లే ఓ అద్భుత సృష్టి!

కాలంతో పాటు నడిచే సత్య ప్రభోధిని !!


కలం , పదాల స్వరాలను పలికిస్తూ, 

మౌన గీతాలు పాడుతుంది.

సూక్ష్మమైన ఆలోచనలకు ఆకృతినిస్తుంది.

పదునైన కొనతో, పదాలు చెక్కుతుంది.!!


కలము, చేతిలో ఒదిగిన ఒక నిప్పుకణం,

అక్షర జ్వాలలతో అన్యాయాన్ని దహిస్తుంది.

నిశ్శబ్దంగా రగిలి, ప్రజ్వలించి,

లోకంలో మార్పుకు నాంది పలుకుతుంది.!!


ఇందులో ఉన్నది కేవలం సిరా చుక్కే కాదు,

అణగారిన గొంతుల నుండి పెల్లుబికిన ఆగ్రహం.

అక్షరం అక్షరంతో  కలిసి అణ్వాస్త్రమై,

నిరంకుశత్వపు కోటలను కూల్చివేస్తుంది.!!


కలము, ఇది అక్షర పోరాట భేరి,

ప్రజల ఆవేశానికి, అస్త్ర మౌతుంది.

ప్రతి పదం ఒక పిడికిలై,

అణచివేతలపై తిరుగుబాటు చేస్తుంది, !!


కలం, కేవలం కాగితంపై గీతలే కాదు,

సంకెళ్ళను తెంచుకునే సంకల్ప బలం.

రాతిలో నిండిన భక్తి , రాతలో దాగిన శక్తి , 

నూతన సమాజ స్థాపనకు పునాది వేస్తుంది.!!


కలం, ప్రజల భావ బీజాలకు చైతన్య శక్తి.

ప్రతీ రంగుకు ప్రాణం పోస్తుంది.

ప్రతీ భావానికి చిత్రం గీస్తుంది.

కలం కదిలితే, చరిత్రే మారుతుంది.!!


---------------------------

ఈ కవిత నా స్వీయ రచన.

శీర్షిక : శ్రీరామ నామ మహిమ.

శీర్షిక : శ్రీరామ నామ మహిమ.

(గేయ కవిత).

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .

కళ్యాణ్ : మహారాష్ట్ర. 43.


---------------------------


అనంతమైనది రామ నామము 

 శక్తి నిండిన నామము

 జగతికిది ఆధార భూతము.

జయము మంగళ నామము !!


పలికినంతనే పులకరింతల

మనసు నిండిన నామము

తొలగు కర్మల మలిన మంతయు

ధర్మ పథమిడు నామము !!


ధర్మ రూపుడ యోధ్యరాముడు,

నీతి , నియమము కద్దము 

ఆతని నామము నమృత ధారలు

త్రాగు వారికి మోక్షము !!.


ఎన్ని యుగములు గడచినా ఘన

మహిమ తరగని  నామము.

భక్తి వేడిన ముక్తి నొసగును.

కరుణ నిండిన నామము!!


 మార్గ దర్శన మిడును నిత్యము.

నామ జపమొక ఒక యజ్ఞము

 కథలు వినుటయె పరమ మోదము

జన్మ జన్మల భాగ్యము.!!


----------------------

ఈ గేయ కవిత నా స్వీయ రచన.




అంశం : డా బి.ఆర్.అంబేద్కర్.

డా బి.ఆర్.అంబేద్కర్ గారి జయంతి* సందర్బంగా కవిత.

 అంశం : డా బి.ఆర్.అంబేద్కర్.

శీర్షిక : నిత్య చైతన్య స్ఫూర్తి .

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి

 కల్యాణ్. మహారాష్ట్ర .

--------------------------


నలుపు తెరల వెనుక దాగి, 

నలిగిన గుండె చప్పుడు విన్నావా?

భీముని పిలుపులో, అణగారిన

 ఆత్మల ఆక్రందన విన్నావా?


పుట్టిన నేలపైనే పరాయివాడై,

 నీరు సైతం నిరాకరించబడిన ,

ఒక బలహీనని భవిత కథ విన్నావా? 


నీడ లేని బాల్యం, నిప్పుల కొలిమి వంటిది,

అంటరానితనపు ముల్లు గుచ్చినా, ఆత్మ నిబ్బరం చెదరనిది.!!

జ్ఞానపు జ్యోతిని వెలిగించి, చీకటిని 

పారద్రోలాలనే తపన నిండిన ఘనతతనిది.!!


బడి గడప తొక్కనివ్వకపోయినా, పట్టుదల వీడని దీక్షా దక్షుడు,

పుస్తకాలే ప్రాణమిత్రులు  కాగా ,అక్షరాలనే ఆయుధంగా, చేసుకున్నాడు.!!


కోట్లాది గొంతుల సింహ గర్జనై ,హక్కుల కోసం 

ఉప్పెనలా  ఉద్యమించాడు,

  రాజ్యాంగ నిర్మాతగా  శిఖరంలా నిలచి ,

ధృవతారలా జాతికి దిక్సూచి అయ్యాడు,!!


కులమతాల కట్టుబాట్లను తెంచి

 పౌర హక్కులను కవచంలా కాపాడాడు, 

రాజ్యాంగపు చుక్కానియై, 

నవభారతానికి దిశానిర్దేశం చేసాడు.

సమానత్వం, సౌభ్రాతృత్వం నినదించి,

 జాతిని వెలుగుబాట పట్టించాడు..

భారతీయ సమాజానికి   భాస్కరుడిలా,

 వెలుగునిచ్చే మార్గదర్శకుడయ్యాడు .!!


అతని ఆశయాలే మనకు స్ఫూర్తి, 

ఆతని అడుగుజాడలే మనకు గమ్యం,

ఆతని పోరాటమజరామరం,

అణగారిన వర్గాలకు ఆయన,  నిత్య చైతన్య స్ఫూర్తి .

భారత జాతి గుండెల్లో కొలువై ఉన్న 

"డాక్టర్ అంబేద్కర్ " అమర  ఘన కీర్తి.,


శీర్షిక : సాంప్రదాయ పండుగలు.

అంశం:  జాతర : గేయం.

శీర్షిక : సాంప్రదాయ పండుగలు.

రచన ,శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

కల్యాణ్ .మహారాష్ట్ర .



---------------------


గిరగిర తిరిగే రంగుల రాట్నాలు

సందడి నిండిన జాతర  హోరులు

పెద్దల మదిలో భక్తి  భావాలు

చిన్నారి  పాపలు చిందేటి నవ్వులు !!


అంగడి నిండిన బొమ్మల కొలువులు

గాజుల గలగల నిండిన భామలు

పట్టు పావడల రేపరెపల కళలు

కన్నెల పదముల మ్రోగేటి మువ్వలు!!


చల్లని పానీయాలు పంచేటి దాతలు

అరిసెలు, బూరెలు అమ్మేటి బామ్మలు

బజ్జీల ఘుమఘమ నిండిన వీధులు

నోరులు ఊరించు తీయని అమ్మకాలు !!


కోలాటకాటలు , చప్పుళ్ళు, తాళాలు

ఇంపైన భజనలు ,. భక్తి పాటలు 

నాగస్వరాల నాడే పాములు

భక్తిశ్రద్ధలతో   కొలువుల పూజలు !!


గుడిలో దేవుని దర్శన భాగ్యం

నమ్మిన జేజికి బోనాల భోగం.

మ్రొక్కులు, ముడుపుల జన సందోహం.!

తీర్థ ప్రసాదాలనందే యోగం.!!


పల్లెలు నిండిన ,సరి సాంప్రదాయాలు. 

జనాల మోమున వెలిగే కాంతులు.

జాతర నిండిన ఆనంద దీపాలు

కొలువూరు దీరిన దేవ- దేవుళ్లు !!


జాతర, సందళ్లు  జయమైన కోర్కెలు

గుండెలు నిండిన  అతి మధుర స్మృతులు

దేవుని మహిమల  కీర్తులే పాటలు

ఏటేటి జాతర కెదురెదురు చూపులు !!

----------------------------


ఈ గేయం నా స్వీయ రచన.

శీర్షిక : వీడని లక్ష్యం.

15/05/2025.

శీర్షిక :  వీడని లక్ష్యం. 

శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి.

కళ్యాణ్ : మహారాష్ట్ర.



హిమగిరుల శిఖరం నీ ధీరత్వానికి నిదర్శనం

ఆకాశమంత  విశాలమైనది నీ గుండె లయ తత్వం

 నీ మేని పులకరింతల మలుపు భూమి తల్లి  పిలుపు

నీ అడుగుల చప్పుడు శత్రువు గుండెల్లో ఉరుముల తలపు.


ఎండ నిప్పుల జ్వాలైనా నీ సంకల్పం చెదరనిది,

కురిసే వాన ప్రళయమైనా నీ ధైర్యం తరగనిది..

మంచు దుప్పటి ముసుగేసినా నీ కాంతి దాగని నిధి

నీ కనురెప్పల సారధి .సరిహద్దును కాచే పెన్నిధి.


 కొండంత బరువును మోసేది ,నీ భుజ బలం

నీ  చూపుల తూణీరం లక్ష్యాన్ని ఛేదించే వరం.

పట్టిన తుపాకీ బలం నీ  విశ్వాసానికి ప్రతిరూపం, 

తుపాకీ గుళ్ళ శబ్దం శత్రువు గుండెకు పిడుగుపాటు భయం.


నేల  నీ రక్తంతో ఎరుపెక్కినా, 

భరతమాత రక్షణకై నీవు నిలబడే ఉంటావు.

ఎప్పటికీ వదలని గమ్యం, భారతమాత కీర్తి పతాకం 

చివరి శ్వాస వదిలే వరకు ముందడుగే నీ లక్ష్యం.




15/05/2025.

మనోహరీ మహిళా పత్రిక కొరకు,

అంశం : ఐచ్ఛికం.

శీర్షిక: భరత వీరుడు.

ప్రక్రియ : వచన కవిత.

రచన : శ్రీమతి , పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .

కళ్యాణ్ :  మహరాష్ట్ర.



హిమగిరుల శిఖరాల వెన్నంటి నిలిచి,

దేశపు కీర్తి పతాకాన్ని భుజాన మోసేవు.

మాతృభూమి పిలుపు నీ గుండె చప్పుడుగా,

ప్రతి అడుగులో ధైర్యం నింపుకు నడిచేవు, 


ఎండైనా, వానైనా, మంచు కురిసినా ,చలికి వణకినా,

సరిహద్దు కాపలా నీ కర్తవ్యంగా నిలిచేవు.

చావు బతుకుల సంఘర్షణకు లోనవక

నీ గుండె లయల శ్వాసలో తెగువ నింపావు.


దేశమే నీ ఇల్లు, ప్రజలే నీ బంధువులుగా.

బలిదానమే బాధ్యతగా చేబట్టేవు.

అన్న పానాలకు లోటైనా, ఐనవారికి దూరమైనా 

కన్నీటి ప్రేమను కర్తవ్య బాధ్యతగా ఔపోసన పట్టావు.


తుపాకీ నీ ఆయుధంగా, ధైర్యమే నీ బలంగా,

న్యాయం కోసం పోరాటం  సాగించేవు

శత్రువు కంట పడితే సింహంలా గర్జించి,

భారతమాత రక్షణే నీ లక్ష్యమని నిరూపించేవు.


గాయాలైనా లెక్కచేయవు, ప్రాణాలైనా అర్పిస్తావు,

దేశం కోసం చేసే  నీ త్యాగం అనంతం.

నీ త్యాగానికి వెలకట్టలేము. 

మీ బలిదానానికి రుణం తీర్చుకోలేము..


ఓ భారతీయ సైనికుడా, నీ ధైర్యానికి  అభినందనం.

ఎనలేని నీ త్యాగానికి  నిత్య నీరాజనాలతో వందనం.


హామీ :

ఈ కవిత నా సీయ రచన





శీర్షిక :- బంధాను బంధాలు.

16/05/2025.

మహతీ సాహితీ కవి సంగమం

అంశం , ఐచ్ఛికం 

శీర్షిక  :- బంధాను బంధాలు.

రచన : శ్రీమతి , పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .

కళ్యాణ్ :  మహరాష్ట్ర. (43).

కవిత సంఖ్య = 1.



ఒక్కరు తోడుంటే ,

ఒంటరివైన వేదన దూరమౌతుంది

మనసు పడే బాధను , 

మనసునన్న స్నేహం మరిపిస్తుంది

ప్రేమను పంచే హృదయముంటే, 

బంధం ఎంతో మధురమోతుంది !!


నమ్మకమనే పునాది ఉంటే, 

అనుబంధం శాశ్వతమౌతుంది.

కష్టంలో చేయూత నిచ్చే బంధం 

బంధుత్వాన్ని బలపరుస్తుంది !!


సంతోషం పాలు పంచుకోవాలంటే , 

స్నేహితులు తోడవ్వాలి.

అపార్థాల మేఘాలు కమ్మిన చోట

" క్షమ" అనే వెలుగు నింపాలి.


తెగిన బంధం తిరిగి కలవాలంటే, 

వీడని ప్రయత్నం చేయాలి .

గుండెకు గుండె తోడై నిలిస్తే, 

జీవితమే  స్వర్గమౌతుంది !!


మాటలు లేని మూగ  సంభాషణ, 

ప్రేమ బంధాలకు  మౌన సంకేతమవుతుంది

కాలం గడిచే కొద్దీ బంధాలు బలపడాలంటే 

ప్రేమానురాగాలు నిండే హృదయముండాలి !!


మానవత్వం మంట కలిసిపోకుండా ఉండాలంటే

మాటల్లో మంచితనం , చేతల్లో చేరువతనం ఉండాలి.

మానవ బంధాలెంతో గొప్పగా ఎదగాలంటే, 

మనిషికి మనిషి మీద నమ్మకం ఉండాలి.!!


మనుషిలా బతుకుతూనే మనీషి గా ఎదగాలి.

ఎదగాలంటే  ఒదగాలి.

ఒదిగి ఉండాలంటే  మానవ సంబంధాలకు 

నిజమైన అర్థం తెలుసుకోవాలి !!


-----------------------------

ఈ కవిత నా స్వీయ రచన.




శీర్షిక : శాంతి స్వప్నం -

శీర్షిక : శాంతి స్వప్నం - 


రచన : శ్రీమతి , పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .

కళ్యాణ్ :  మహరాష్ట్ర. 




తెల్ల కాగితంపై నల్లని సిరాతో సంతకం,

యుద్ధపు గాయాలపై  పూసే శాంతి లేపనం!

హస్తాలు కలిసినట్టు పైకి నటించే యత్నం.

మనసుల్లో  నిండే భగభగలు దాచే ప్రయత్నం.!!


గుండెల నిండా ద్వేషం దాచిన ఘనం .

పెదవులపై చిరునవ్వులు పూయించే వనం.

"సీజ్ ఫైర్" కేవలం ఒక ఓదార్పు  తాయిలం .

ఎన్నికల ముందు ఓట్ల వేటకు పనికొచ్చే సాధనం..!!


అంతర్జాతీయ ఒత్తిడి నిండిన ఫలితాల కలకలం,

సరిహద్దుల్లో నిరీక్షించే సైనికుల సహనానికి బలం.

భయంతో కొట్టుకుపోయే  తల్లుల గుండెల్లో ప్రభంజనం. 

కన్నీటి  జ్వాలలు ఎగదోసే  శోకాలకు ఇంధనం.!!


"సీజ్ ఫైర్"  నిజమైన శాంతి నీయని మాయా జాలం.

మళ్ళీ మొదలయ్యే యుద్ధానికి నాంది పలికే  నాటకం.

నాయకుల మనసుల్లో ఏముందో, తెలుసుకోలేరు జనం.

రక్తపు మరకల పూత , బాంబులు చేసే మోత 

వారికి, వినబడవు , కనబడవు అన్నది నిజం,,!!


 నాటకంలో తెర వెనుక నుండి, పన్నిన కుట్రల వేటలు

రాజకీయ రంగంలో శాంతి భాష్యాలు పలికే  పాత్రలకు బాటలు.

బాధితుల ఆర్తనాదాలు వినిపించనంత వరకు,

కేవలం తాత్కాలిక ఉపశమనం ఇచ్చేవి మాత్రమే

ఈ "సీజ్ ఫైర్" మాటలు. .!!


నిజమైన "శాంతి" రావాలంటే మనసులు కలవాలి,

రాజకీయ రచ్ఛలు తగ్గి, సామూహిక చర్చలు పెరగాలి.

కులమతాల జాడ్యాలు వదలాలి .మానవత్వం గెలవాలి .

చేయీ చేయీ కలవాలి , అడుగులో అడుగేసి నడవాలి.!!

--------------------------------------------

శీర్షిక : అసమానతల జీవిత పోరాటం.

శీర్షిక : అసమానతల జీవిత పోరాటం.

రచన : శ్రీమతి , పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .

కళ్యాణ్ :  మహరాష్ట్ర.




మనిషి ఎదురుగ, నిలిచిన కష్టాల కొండ,

గుండె నిండా ధైర్యం ఒక్కటే అతనికి అండ.

నేలపై తడబడి  కాలు జారినా, నిరంతరం

 నిలబడాలన్న తపన అతని అజెండా !!


సవాళ్ళ సుడిలో చిక్కుకున్నా గాని,

ఆశల దీపం మాత్రం ఆరని జ్వాల.

రేపటి వెలుగు కోసం చేసే నిరీక్షణలో

ప్రతి అడుగులోనూ ఒక పోరాట లీల !!


ఒంటరి పోరాటంలో కనబడని సమస్యలు. 

కన్నీటి చుక్కలే వాటికి దారి చూపే గువ్వలు.

పట్టుదల అనే బలమైన ఊతంతో,

జీవితపు నదిలో ఎదురీతల  కలకలలు .!!


ఓటమి అంచున నిలిచినా కానీ,

మళ్ళీ లేచే శక్తి అతని సొంతం.

కాలం చేసే గాయాలకు మందుగా,

నిబ్బరం నింపుకున్న ధీరత్వపు పంతం.!!


అసమానతల నీడలు కమ్మినా, అతనిలో

ఆత్మ విశ్వాసం వెలిగే కాంతి పుంజం.

ఈ పోరాటం ఒక అందమైన తలపైతే

మనిషిలోని ధైర్యానికి ఇది నిదర్శనం.!!


ప్రతి కష్టం ఒక మలుపు తిరిగే కథ,

ప్రతి పోరాటం ఒక కొత్త ఉదయమేకదా.

అసమానతల మధ్య సాగే ఈ ప్రయాణం,

మనిషిని బలవంతుడిని చేసే మహా యజ్ఞం.!!


------------------------------------

అంశం : అణుబాంబు: ఒక సామాజిక ఆర్తనాదాం.

అంశం : అణుబాంబు: 

శీర్షిక : ఒక సామాజిక ఆర్తనాదాం.


రచన :  శ్రీమతి :  పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .

కళ్యాణ్ :  మహారాష్ట్ర. (38).

వచన కవిత : సంఖ్య.. 3 



ఎదలో రగిలే అగ్ని కీల,

మానవత్వపు గుండెకోతల జ్వాల.

అణుబాంబు, పేరులోనే ఒక శూన్యం,

భవిష్యత్తుకిది భయంకర సంకేతం.!!.


క్షణంలో  కాలాన్ని కరిగించి

వేల ప్రాణాల భస్మరాశిని పెంచి

భూమి గుండె బీటల్లో మిగిల్చి

మానవ బంధాల్లో చీలికలు నింపేది.!!


పట్టపగలే  చీకటి కమ్మినా,

ఆకాశం  ఎర్రగా మారినా

నిశ్శబ్దం నిక్కి నిక్కి దాగినా

వినిపిస్తున్న ఒక విషాద గీతం !!


పిల్లల నవ్వులు ఆవిరై,

తల్లుల కన్నీరు బూడిదై

ఆశలు సన్నగిల్లిన ఆక్రోశాలతో,

ఒక తరం అంతమైపోతోంది.!!


శక్తి పేరిట విధ్వంసపు ముళ్ళు

జ్ఞానం పేరిట అజ్ఞానపు రాళ్లు

అభివృద్ధి పేరిట వినాశనపు వేళ్లు,

 సృష్టికలో పాకుతున్న శాంతి లేని బీజాలు.!!


అణుబాంబు సృష్టించిన నరకం.

తరతరాలకీ మానని గాయాల కూపం.

గుండెల్లో రగిలే దుఃఖం,

ఆరని మంటల్లో చితులు నిండిన శాపం !!


శాంతిని కోరే హృదయాల వేదన

యుద్ధం వద్దు అన్న  ఆక్రోశాల ప్రార్థన

అణు విస్ఫోటనం ఆపాలన్న తపన

ఆర్తి నిండిన గొంతుల్లో ఉద్వేగపు నిరీక్షణ !!

అణుబాంబు కేవలం ఒక ఆయుధం కాదు,

మానవ సమాజానికి ఓ కనువిప్పు,

ఎవరి స్వార్థం కోసమూ దాగని నిజం,

శాంతి స్థాపనకై పోరాడాలి ఈ సమాజం.!!


అందరూ ఒక్కటై నిలబడి యోచించి

అహింసా మార్గాన్ని అనుసరించి,

అణుయుద్ధ భయాన్ని తొలగిద్దాం,

శాంతియుత ప్రపంచాన్ని నిర్మిద్దాం.!!


భవిష్యత్ తరాలకు బతుకు బాట వేద్దాం.

మన వారసత్వాలకు మానవత్వం నేర్పిద్దాం.

విశ్వ కళ్యాణం కోసం  విధ్వంసాల నాపేద్దాం

 అందరం ఒక్కటై ఆనంద గీతం పాడేద్దాం. !!. 

---------------------------------


ఈ కవిత,  నా స్వీయ రచన.





శీర్షిక : వెలుగు పూల తోట.(పాజిటివ్ థింకింగ్ .)

శీర్షిక  : వెలుగు పూల తోట.(పాజిటివ్ థింకింగ్ .)

రచన :  శ్రీమతి :  పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .

కళ్యాణ్ :  మహారాష్ట్ర. 



మనసు వాకిట మెరిసే వెన్నెల కిరణం,

ప్రతి అణువులోనూ ఆశల నవగానం.

నైరాశ్యపు చీకటి కమ్మిన వేళలో,

అంతరంగంలో మెరిసే వెలుగు పూదోట.!!

(పాజిటివ్ థింకింగ్ .)


ఉదయ, సంధ్యా కిరణంలా,

ప్రతి ఆలోచనా నవజీవనం.

గతపు గాయాలెన్ని ఉన్నా,

రేపటి "పై చిరునవ్వుల "సంతకం.!!

(పాజిటివ్ థింకింగ్ .)


సంద్ర గర్భాన దాగిన ముత్యంలా,

సవాళ్ళ లోతుల చిరు నవ్వులు.

ఎగిసే కెరటాల కల్లోలంలో,

స్థైర్యపు తీరం చేర్చే నావ !!

(పాజిటివ్ థింకింగ్ .)



పూచే గులాబీ సువాసనలా,

ప్రతి శ్వాసలోనూ ప్రశాంతత.

ముళ్ళబాటలో నడుస్తున్నా,

మధురానుభూతిని పంచే వరం !!

(పాజిటివ్ థింకింగ్ .)


జీవితం ఒక అద్భుత చిత్రం.

ప్రతి అడుగూ ఒక నృత్యం,

సానుకూల దృక్పథంతో చూడు,

ప్రతి క్షణం ఒక మధుర గీతం.!!

-----------------------

ఈ కవిత నా స్వీయ రచన

శీర్షిక : ఆంతరంగిక ఘోష. (.అసలైన కవి)

శీర్షిక  : ఆంతరంగిక ఘోష. (.అసలైన కవి)

రచన :  శ్రీమతి :  పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .

కళ్యాణ్ :  మహారాష్ట్ర. ( 38).


--------------------


అక్షరాల వేదికపై, ఆలోచనల స్ఫూర్తితో,

సత్య దీపాలు వెలిగించేవాడే కవి.

లోకానికి అద్దం పట్టే, నిజాలను

 నిర్భయంగా చాటి చెప్పేవాడే కవి.!!


కాగిత రణరంగంపై, కలాన్ని ఖడ్గంగా మార్చి,

అన్యాయంపై పోరాడే  అక్షర వీరుడే కవి.

కష్టాల కడలిలో, కన్నీటి అలలపై,

ఆశల తీరం చూపే నావికుడు కవి.!!


భయమన్నది లేక, పక్షపాతమన్నది ఎరుగక,

పలుకుబడికి తలొగ్గని ప్రవక్తే కవి.

మానవత్వం మంటగలిసినప్పుడు,

మనసున్న మనిషిలా మేల్కొనేవాడే కవి.!!


అంధకారం ఆవరించిన వేళ,

వెలుగు కిరణం చూపించే ధైర్యమే కవి.

నిజాన్ని నిగ్గదీసి, నిర్భయంగా నిలదీసి,

నిత్య సత్యాన్ని నిలబెట్టేవాడే కవి.!!


అక్షరాల ఆయుధాన్ని  ఝళిపిస్తూ

విభేధాలను సృష్టించే వారిని ప్రశ్నిస్తూ

మానవత్వానికి  మన్నననిస్తూ

మనుగడని ప్రశ్నించేవాడే కవి. !!.


నోళ్ళు మూగబోయిన చోట,

వారధిగా నిలిచే వాగ్ధాటి కవి.

అణగారిన గొంతులకి స్వరమై,

 పోరాడే అక్షర నినాదమే కవి.!!


భయం తెలియని

 భావనా సాగరం కవిత్వం,

పలుకుబడికి తలవంచని 

ప్రళయ ఘోష కవిత్వం.!!


నివురు గప్పిన నిజాలకు ,

అతని కవిత్వం ఒక కరదీపిక,

అది సమాజానికి  అవ్వాలి

దారి చూపే సరికొత్త మార్గదర్శిక.!!

-----------------------




Wednesday, May 21, 2025

శీర్షిక : ముల్లోక సంచారుడు.

19/05/2025.

(సోమవారం)

మహతీ సాహితీ కవి సంగమం

అంశం :  (చిత్ర కవిత. 105.)

వచన కవిత .

శీర్షిక : ముల్లోక సంచారుడు.


రచన , శ్రీమతి , పుల్లభట్ల జగదీశ్వరీమూర్తి . 

కళ్యాణ్ :  మహారాష్ట్ర.



ముల్లోక సంచారి ముని నారదుండు,

మదిని నిరంతర నారాయణ ధ్యానముండు.

లోక కళ్యాణమే అతని నిత్య జీవితము,

అందరిలో వెలుగు నింపు దివ్య తేజము.!!


ముల్లోకముల దారి ముని దివ్య తేజము,

పరికించ లోకముల పయనించు నిత్యము.

కలహ ప్రియుడంచు లోకులు వచియించిన

అంతరంగమున లోక  విలువలవనంతము !!


కయ్యాలు రేపేట్టు కనిపించు క్షణములో,

లోతైన అర్థమే   దాగియుండు నందులో

ఘర్షణలు  ఎన్నైన  శాంతి నిడు భువిలో

లోక కల్యాణమే,  లక్ష్య మాతని మదిలో.!!


అపార్థపు నీడలు కమ్మేటి మనసులకు,

కొత్త  ప్రణాళికల కోరు శాంతిని గూర్చు.

 మహతి మీటుచు నతడు మంచి చేసెడు వాడు

సందేహ చీకట్లు తొలగించు వాడు !!


కలహప్రియుడను పేర కలిగించు న్యాయము !!

నారదుని  చర్యలో నుండు పరమార్థము,

ముల్లోకముల మేలు కోరు మునిశ్రేష్ఠులు.

కేలుమోడ్చీ జేతు నే కోటి వందనములు


Tuesday, May 20, 2025

' పెళ్లి " గేయం.

20/05/2025.


తపస్వీ మనోహరం "e" book పత్రిక కొరకు ,

అంశం : పంచమ వేదం.

శీర్షిక : అమృత నాదం.

రచన :  శ్రీమతి :  పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .

కళ్యాణ్ :  మహారాష్ట్ర.




అనాదిగా ప్రవహించే సనాతన ధర్మం,

వేదాల దివ్యనాదం, ఋషుల తపో ఫలం.

శ్రుతులు, స్మృతులు, ఇతిహాసాల మౌన గంభీరత,

మానవాళికి మోక్ష మార్గం చూపిన దివ్య తేజం.!!


ధర్మం, అర్థం, కామం, మోక్షం - నాలుగు తీరాల నది,

వేద నాదం ప్రతి తీరాన అమృత బిందువై ఒదిగింది.

 కాల గమనంలో మరుగున పడిన సత్యం .

పునరుద్ధరించగ వచ్చింది "పంచమ వేదం "!!


వ్యాసుని లేఖినిలో మహా భారతం పురుడు పోసుకోగా,

"భగవద్గీత సారం" విశ్వానికి వెలుగు పంచింది.

రామాయణ,భారత, భాగవతాది, పురాణాల పవిత్ర గానం,

"పంచమ వేదమై", లోకానికి నవ చైతన్యం తెచ్చింది.!!


పంచము వేదం , కేవలం శ్లోకాల సంపుటి కాదు,

ప్రతి హృదయంలో జ్వలించే జ్ఞాన దీపం.

కుల, మత, వర్గ భేదాలు లేని విశ్వ ప్రేమ స్వరూపం.

మానవత్వమే మహోన్నతమని చాటే శాంతి సందేశం.!!


భక్తి, జ్ఞానం, కర్మల - త్రివేణి సంగమం .

పురనేతిహాసాలిడు ఆత్మ సాక్షాత్కారాలకు గమ్యం.

ప్రతి జీవిలోనూ దైవత్వాన్ని దర్శించే దివ్య దృష్టి,

పంచమ వేదం నేర్పే నిత్య జీవన సత్యం.!!


అందుకే ఈ ధర్మం సనాతనం, సజీవం,

యుగయుగాలకూ మార్గదర్శనం.

అంధకారాన్ని చీల్చే జ్ఞాన భాస్కరం,

మానవాళికి నిత్య వసంతం, "పంచమ వేదం".!!



పంచమ వేదం

20/05/2025.


తపస్వీ మనోహరం "e" book పత్రిక కొరకు ,

అంశం : పంచమ వేదం.

శీర్షిక : అమృత నాదం.

రచన :  శ్రీమతి :  పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .

కళ్యాణ్ :  మహారాష్ట్ర.




అనాదిగా ప్రవహించే సనాతన ధర్మం,

వేదాల దివ్యనాదం, ఋషుల తపో ఫలం.

శ్రుతులు, స్మృతులు, ఇతిహాసాల మౌన గంభీరత,

మానవాళికి మోక్ష మార్గం చూపిన దివ్య తేజం.!!


ధర్మం, అర్థం, కామం, మోక్షం - నాలుగు తీరాల నది,

వేద నాదం ప్రతి తీరాన అమృత బిందువై ఒదిగింది.

 కాల గమనంలో మరుగున పడిన సత్యం .

పునరుద్ధరించగ వచ్చింది "పంచమ వేదం "!!


వ్యాసుని లేఖినిలో మహా భారతం పురుడు పోసుకోగా,

"భగవద్గీత సారం" విశ్వానికి వెలుగు పంచింది.

రామాయణ,భారత, భాగవతాది, పురాణాల పవిత్ర గానం,

"పంచమ వేదమై", లోకానికి నవ చైతన్యం తెచ్చింది.!!


పంచము వేదం , కేవలం శ్లోకాల సంపుటి కాదు,

ప్రతి హృదయంలో జ్వలించే జ్ఞాన దీపం.

కుల, మత, వర్గ భేదాలు లేని విశ్వ ప్రేమ స్వరూపం.

మానవత్వమే మహోన్నతమని చాటే శాంతి సందేశం.!!


భక్తి, జ్ఞానం, కర్మల - త్రివేణి సంగమం .

పురనేతిహాసాలిడు ఆత్మ సాక్షాత్కారాలకు గమ్యం.

ప్రతి జీవిలోనూ దైవత్వాన్ని దర్శించే దివ్య దృష్టి,

పంచమ వేదం నేర్పే నిత్య జీవన సత్యం.!!


అందుకే ఈ ధర్మం సనాతనం, సజీవం,

యుగయుగాలకూ మార్గదర్శనం.

అంధకారాన్ని చీల్చే జ్ఞాన భాస్కరం,

మానవాళికి నిత్య వసంతం, "పంచమ వేదం".!!



Saturday, May 17, 2025

ప్రముఖ కళాకారిణి ( శాంత కుమారి) గురించి.

నేడు ప్రముఖ కళాకారిణి ( శాంత కుమారి). పాత సినిమాల హీరోయిన్... అసలు పేరు.
*వెల్లాల సుబ్బమ్మ* జయంతి 

ప్రఖ్యాత దర్శకుడు పి.పుల్లయ్య సతీమణి అయిన శాంతకుమారి 1936లో 'శశిరేఖాపరిణయం' సినిమాతో నటజీవితం ప్రారంభించి వందకు పైగా సినిమాల్లో నటిం చారు. 'కృష్ణప్రేమ, మాయాలోకం, ధర్మదేవత, తల్లా?పెళ్లామా?, 'అర్ధాంగి, జయభేరి, రాముడుభీముడు, శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం, ప్రేమనగర్‌' తదితర చిత్రాల్లోని పాత్రల పోషణ ద్వారా నటిగా ఆమె మంచి పేరు తెచ్చుకున్నారు. శాంతకుమారి పి.పుల్లయ్య దంపతులకు రాధ, పద్మ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

శాంతకుమారి అసలు పేరు : వెల్లాల సుబ్బమ్మ.
స్క్రీన్ నేమ్ : శాంతకుమారి - దర్శక-నిర్మాత పి.వి.దాసు గారు సుబ్బమ్మ కొంచెం 
పాతగా ఉందని పేరునుశాంతకుమారిగా మార్చారు.
పుట్టిన ఊరు : కడప జిల్లా ప్రొద్దుటూరు
పుట్టిన తేది : మే- 17, 1920 సంవత్సరంలో,
మరణించిన తేది : జనవరి -17 - 2006,
తండ్రీ పేరు : వెల్లాల శ్రీనివాసరావు గారికి జన్మించారు.
భర్త పేరు : ఫి.పుల్లయ్య - సినిమా దర్శక నిర్మాత ,
పిల్లలు : రాధ, పద్మ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

శ్రీనివాసరావు గారికి కళలు అంటే ఎంతో ఇష్టం. అందుకనే కూతురైన సుబ్బమ్మను మద్ర్రాసులో ఉన్న ప్రొ.పి.సాంబమూర్తి గారి వద్దకు కర్ణాటక సంగీతం మరియు వయొలిన్ నేర్చుకోవటానికి దరఖాస్తు చేయించారు. డి.కె.పట్టమాళ్ సుబ్బమ్మ యొక్క సహాధ్యాయిని. పదమూడేళ్ళ వయసులోనే సుబ్బమ్మ కర్ణాటక సంగీతంలోఉత్తీర్ణురాలయ్యిందిపదహైదేళ్ళ వయసులో వయొలిన్ లో ఉత్తీర్ణురాలైంది. తరువాత గురువుగారితో కలసి దక్షిణబారతదేశం అంతా ఎన్నో కచేరీలు చేసింది. పదహారేళ్ళ వయసులోనే విద్యోదయా స్కూలులో పిల్లలకు సంగీతంనేర్పించేది.

సుబ్బమ్మ కచేరి చూసిన దర్శక-నిర్మాత పి.వి.దాసు మాయాబజార్ (1936) లేదా శశిరేఖ పరిణయం సినిమాలో శశిరేఖపాత్రను ఇచ్చారు. కానీ సుబ్బమ్మ సినిమాలలో నటించటానికి ఆమె బామ్మ నిరాకరించడంతో, పి.వి.దాసు మరియు అతని మేకప్ మనిషైన మంగయ్య వప్పించడానికి ఎంతో ప్రయత్నించారు. సుబ్బమ్మను శశిరేఖ వేషంలో చూసిన ఆమె బామ్మ చివరకు ఆమె సినిమాలో నటించడానికి ఒప్పుకొంది. దాసుగారు సుబ్బమ్మ కొంచెం పాతగా ఉందని పేరును శాంతకుమారిగా మార్చారు. శాంతకుమారిగా మారిన నట-గాయక సంచలనం తరువాత సినిమా సారంగధర (1937). ఇందులో ఆమె చిత్రాంగి అనే దుష్టపాత్రను ఎంతో ఉత్సాహభరితంగా నటించింది. ఈ చిత్ర దర్శకుడైన పి.పుల్లయ్యగారిని ఇష్టపడి పెళ్ళిచేసుకొంది. పెళ్ళిచేసుకొన్న తరువాతకూడ ఆమె నట జీవితం సాఫీగా సాగిపోయింది.శాంత కుమారి సినిమా జీవితం మొదట్లో అన్నీ పురాణాలు ఇతివృత్తంగా ఉన్న సినిమాలలోనే నటించారు. యశోదగా కూడా నటించిన ఈమె కృష్ణుని ముద్దుచేస్తూ "చిరు చిరు నగవులు చిందే తండ్రి" అనే మధురమైన పాటను అద్భుతంగా పాడారు. శాంతకుమారికి మెదటి సాంఘిక చిత్రం ధర్మపత్ని. అందులో అక్కినేని నాగేశ్వరరావు విధ్యార్థిగా నటించారు. అక్కినేనికి శాంతకుమారికీ మధ్య ఎంతో ఆత్మీయమైన అనుబంధం ఉండేది. అక్కినేనిని ఆమె అప్యాయంగా చిన్న తమ్ముడిని పిలచినట్లు అబ్బి అనే వారు. మాయలోకం సినిమాలో అక్కినేనికి ప్రక్క కథానాయికగా నటించిన శాంతకుమారి, జయభేరి సినిమాలో వదినగా నటించారు, అర్థాంగి సినిమాలోనైతే సవతి తల్లిగా నటించారు. ఎన్.టీ.ఆర్ కు కూడా తల్లా పెళ్ళామా సినిమాలో బామ్మగా నటించారు. తెలుగు సినీ పరిశ్రమలో అగ్రతారలైన ఎన్‌.టి.రామారావు, అక్కినేని నాగేశ్వర రావు, తమిళ సినీ ప్రముఖులు శివాజీ గణేశన్‌, జెమినీ గణేశన్‌ తదితరులకు చాలా చిత్రాల్లో శాంతకుమారి తల్లిగా నటించారు.పద్మశ్రీ పిక్చర్స్‌, రాగిణి పిక్చర్స్‌ పేరుతో సొంతంగా ఇరవైకి పైగా సినిమాలను నిర్మించారు. తాను హీరోయిన్గాప్రధాన పాత్రల్లో నటించిన సినిమాలనే మళ్లీ తీసినపుడు తల్లి పాత్రల్లో నటించిన అరుదైన రికార్డు శాంతకుమారిసొంతం.

దయగన రావేల....కీర్తన

భోగి రాగం.( ఎవరి బోధన)
దయగన రావేల.

------------------------
దయగన రావేల దశరథే. ( రామ)
;నినువిన దిక్కెవరు. బ్రోవగరావే !!

చయములౌ నీ నామ మహిమలె, ప్రాపు.
జయములు నీ పాద సేవలు మాకు!!

భయములు బాపే వరదుడవీవే
అనయము నీ స్మరణే అభయము గాదే
ఈ గతి ననువీడ . నీకిది మేలా
నా గతి గని బ్రోవ సరగున రావేల !!

 పంతమదేలా
సారసదళనయన సద్గుణ గాత్ర ( నామా)
ముని జన సేవిత ఘన కపి మిత్ర..(ఘన బల భీమా)
భవబంధముల బాపు భాగ్య విధాత
భారమా ననుబ్రోవ భక్తార్తి నాశ !!
----------------------------

Tuesday, May 6, 2025

అంజయ్య గౌడ్

సంబోధన (ప్రథమా విభక్తి)
ఉ..
దండము వాయుపుత్ర!రిపు దండన భక్త విధేయ ధీమణీ!
కొండలరాయ దైత్యహర !కుండల భూషణ!వానరేశ్వరా! చండ పరాక్రమా!విబుధ సన్నుత!
యక్షయ దానవాంతకా!
భండన భీమ!సర్వజన  బాంధవ! బ్రోవగరావెమారుతీ!

    కళిక (వృషభ గతి)
పవన తనయా పాపహరణా!భవ వినాశక భక్త పాలన!
దివిజ వందిత కోటి భాస్కర దివ్య శోభిత గాన మోహన!
కనక రత్న కిరీట ధారణ కాంతి మంతుడ పరమ పావన!
వినుత సద్గుణ వేదవేద్యా! వీరవర్యా విమల శోభన!
భావి బ్రహ్మవు వీరహనుమా!
భయ నివారణ పాప సంహర!
కావరా కరుణాంతరంగా!గందమాదన గిరి విహారా!
దుష్ట శిక్షణ శిష్ట రక్షణ!దోష రహితా యాంజనేయా!
యష్ట సిద్ధుల కాది దేవుడ!
యభయమిడి కాపాడ రావయ!

 ఉత్కళిక ( హరిణగతి)

దివ్యగాత్రా! దీన పోషా!
భవ్య చరితా!వరకపీశా!
యంజనీసుత! యద్రి ధీరా!
యంజలించెద భక్తి మీరా!
రామదాసా రణవిశారద!
భీమ సోదర విశ్వ వరదా!
సూర్య మిత్రా! సూక్ష్మ రూపా 
కార్య సాధన!ఘన ప్రతాపా!

 సార్వ విభక్తికము
శా..
నీవే తోడు, గదయ్య నాకు నెదలో,నిన్ నమ్మితిన్ భక్తిచే!
రావే నీకయి,వేచి చూచెద నయా! రారమ్మి యో పావనీ!
నీవల్లన్ సుఖశాంతులబ్బు భువికిన్ నీయందు నాధ్యానమున్ 
దేవా!మారుతి యాంజనేయ!
హనుమా!తేజోమయా బ్రోవరా!!

 అంకితాంకము 
ఉ..
ఛందపు బంధనంబులను సంధుల సంగతులన్ గణించకే
యందముగా నుదాహరణ మన్ గృతి నొక్కటి వ్రాసి నీ పదం
బందున నుంచి మ్రొక్కితిని నంకిత మీయగ నెంచి యంజనీ 
నందన! "బండకాడి"యను నామక వంశ్యపు "అంజయాఖ్యుడన్"

అంజయ్య గౌడ్ గారి రచన.

సంబోధన (ప్రథమా విభక్తి)
ఉ..
దండము వాయుపుత్ర!రిపు దండన భక్త విధేయ ధీమణీ!
కొండలరాయ దైత్యహర !కుండల భూషణ!వానరేశ్వరా! చండ పరాక్రమా!విబుధ సన్నుత!
యక్షయ దానవాంతకా!
భండన భీమ!సర్వజన  బాంధవ! బ్రోవగరావెమారుతీ!

    కళిక (వృషభ గతి)
పవన తనయా పాపహరణా!భవ వినాశక భక్త పాలన!
దివిజ వందిత కోటి భాస్కర దివ్య శోభిత గాన మోహన!
కనక రత్న కిరీట ధారణ కాంతి మంతుడ పరమ పావన!
వినుత సద్గుణ వేదవేద్యా! వీరవర్యా విమల శోభన!
భావి బ్రహ్మవు వీరహనుమా!
భయ నివారణ పాప సంహర!
కావరా కరుణాంతరంగా!గందమాదన గిరి విహారా!
దుష్ట శిక్షణ శిష్ట రక్షణ!దోష రహితా యాంజనేయా!
యష్ట సిద్ధుల కాది దేవుడ!
యభయమిడి కాపాడ రావయ!

 ఉత్కళిక ( హరిణగతి)

దివ్యగాత్రా! దీన పోషా!
భవ్య చరితా!వరకపీశా!
యంజనీసుత! యద్రి ధీరా!
యంజలించెద భక్తి మీరా!
రామదాసా రణవిశారద!
భీమ సోదర విశ్వ వరదా!
సూర్య మిత్రా! సూక్ష్మ రూపా 
కార్య సాధన!ఘన ప్రతాపా!

 సార్వ విభక్తికము
శా..
నీవే తోడు, గదయ్య నాకు నెదలో,నిన్ నమ్మితిన్ భక్తిచే!
రావే నీకయి,వేచి చూచెద నయా! రారమ్మి యో పావనీ!
నీవల్లన్ సుఖశాంతులబ్బు భువికిన్ నీయందు నాధ్యానమున్ 
దేవా!మారుతి యాంజనేయ!
హనుమా!తేజోమయా బ్రోవరా!!

 అంకితాంకము 
ఉ..
ఛందపు బంధనంబులను సంధుల సంగతులన్ గణించకే
యందముగా నుదాహరణ మన్ గృతి నొక్కటి వ్రాసి నీ పదం
బందున నుంచి మ్రొక్కితిని నంకిత మీయగ నెంచి యంజనీ 
నందన! "బండకాడి"యను నామక వంశ్యపు "అంజయాఖ్యుడన్"